అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం.ఏటా మే రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. గ్రీస్లో ‘రియా’ అనే దేవతను ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జూలియవర్డ్ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది.దాని ఫలితంగా 1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని కొందరు అంటారు. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. కానీ, నేటి అమ్మ ఆధునికతకు నిదర్శనంగా నిలుస్తోంది. కొందరు అమ్మతనంలోని కమ్మదనాన్ని దూరం చేసుకుంటున్నారు. ‘నేడు మాతృదినోత్సవం’ సందర్భంగా తల్లులంతా ఒకసారి తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలి. పిల్లల్ని కడుపులో పెట్టుకు చూసే నాటి అమ్మలను ఆదర్శంగా తీసుకోవాలి.కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడకను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పుచేసినా కడుపులో దాచుకుని, కనికరిస్తుంది. కొడుకులు చెట్టంత ఎదిగి దూర తీరాలకేగినా బిడ్డలు అత్తవారిళ్లకు వెళ్లినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. కన్నపేగుకు ఏచిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్దచేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్లల్లో పెట్టుకుని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం. మానవ విలువలు నశించిపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రదమ నేస్తం అమ్మ.ఆ అమ్మను అందరూ ప్రేమించడం మరచి విద్వేషాలతో స్వార్ధ జీవితం నడుమ బ్రతుకుచున్నారు. ఈ ప్రపంచ మాతృమూర్తి (మదర్స్ దినోత్సవం) సందర్భంలో తల్లి తొలిసారిగా నేర్పిన నడకతో ప్రారంభం అయిన మానవ జీవితం చివరి దశలో అమ్మకు అండగా అందరూ నిలిచి జీవితం సార్ధకత చెందాలని మనసారా కోరుకొంటూ...మీ ......... గురుగుబెల్లి రాజేశ్వరరావు.
ఎడిటర్
కళింగ రాజ్యం,
ప్రజాధ్వని.
ప్రపంచ "మదర్స్ డే" శుభాకాంక్షలు.